తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి), మార్చి 31:తాళ్లపూడి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1న బుధవారం ఉదయం 7 గంటల నుంచి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు మొదటగా ఉదయం 7 గంటలకు గోదావరి నది వరకు ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి భాగంగా స్వామివారి ఊరేగింపుకు ఉపయోగపడే ట్రాలీని అయ్యప్ప భక్తుల్లో ప్రముఖుడైన లకంసాని వరప్రసాద్ దంపతులు (బేకరీ చిన్న) విరాళంగా అందించడం విశేషం. ఈ ట్రాలీని తాళ్లపూడిలోని ఇతర దేవాలయాలు కూడా అవసరమైతే వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
గత రెండు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి గుడి వెనుకనున్న శ్రీ సొలస సత్యనారాయణ & దమయంతి కళ్యాణ మండపాన్ని సింహాద్రి జనార్ధనరావు మరియు యాజమాన్యం ఉచితంగా అందిస్తూ సేవలో భాగస్వామ్యమవుతున్నారు. అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు 41 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు.
“ఈ అన్నదాన కార్యక్రమంలో రోజూ సుమారు 200 మంది అయ్యప్ప భక్తులతో పాటు భవానీలు, శివస్వాములు పాల్గొని ప్రసాదం స్వీకరిస్తున్నారు. తాళ్లపూడి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటుండటం విశేషం.”
ఈ వేడుకలలో ఆలయ అర్చకులు పరస రత్నాజీ, గ్రామ పెద్దలు సింహాద్రి జనార్ధనరావు, నామన పరమేశ్వరరావు, వుడతా వీరేంద్రతో పాటు అనేక మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీ వినాయక స్వామిని ట్రాలీలో ఊరేగిస్తూ “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో శుభారంభం చేశారు.“ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవాలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు.”



