అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా టీడీపీ నేతల ఘన నివాళులు
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంభం విజయ రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రవణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం రావాలనే లక్ష్యంతో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆయన త్యాగఫలితంగానే నేటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు.
అలాగే మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాలకు జీవితాంతం కట్టుబడి పనిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు, ఆశయాలు, పోరాటాలు భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను చిరస్మరణీయంగా నిలుపుతూ, ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల స్మారక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ సూచకమని చెప్పారు. గతంలో ఎన్.టి. రామారావు, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల పాలనలో పొట్టి శ్రీరాములు గారికి సముచిత గౌరవం కల్పించారని తెలిపారు.
తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తున్నామని చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోట గురుబ్రహ్మం, పి.యల్. రావు, బొల్లినేని రామారావు, ధర్మవరపు సుబ్బారావు, పనబాక భూలక్ష్మి, డా. ఊరందూరు సురేంద్ర బాబు, షేక్ రసూల్, షేక్ అమృల్లా, వరికుంట్ల (రాజా) సురేష్, సాబీర్ ఖాన్, మన్నెం పెంచల నాయుడు, నన్నే సాహెబ్, గుమ్మడిపూడి కళ్యాణ్, బీవీ లక్ష్మీ, ధర్మవరపు గణేష్, అంకయ్య, హజరత్ కుమార్ శెట్టి, సోమిశెట్టి మధుసూదన్, ఎల్.సి. రమణా రెడ్డి, గోవింద రాజులు, నెల్లూరు మురళి, ఉప్పు భాస్కర్, సురేంద్ర, మునుస్వామి, శ్రీదేవి, పద్మమ్మ, తనూజ, ప్రమీల, ఈదర శ్రీనివాసులు, వెంగయ్య, బుజ్జయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



