Thursday, 5 February 2026

Tag: Manthani

తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి విద్య విజ్ఞానం హైదరాబాద్

విహార యాత్రలతో విద్యార్థులకు విజ్ఞానం

_మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మీ_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, విజ్ఞాన కేంద్రాలను విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ యాత్రలో విద్యార్థులు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్‌లను సందర్శించి ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లను సందర్శించిన సందర్భంగా వాటి నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యంపై అవగాహన పొందిన విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. నెహ్రూ జూ పార్క్‌లో వివిధ జంతువులు, పక్షులను పరిశీలిస్తూ వాటి జీవన విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రయోగాలు, డైనోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను చూసి విద్యార్థులు ఎంతో ఉత్సాహం కనబరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ.. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం చేకూరుతుందని, అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్, దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

ఖమ్మంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

_క్రైస్తవ సోదర సోదరీమణులకు సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య దంపతుల శుభాకాంక్షలు_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి – రాజయ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ (ఫేత్ బాప్టిస్ట్ చర్చ్), సాముల జీసస్ (ప్రేయర్ చర్చ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సర్పంచ్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఐదుతరాల అపురూప సమ్మేళనం

_ఒక్క వేదికపై 200 మంది కుటుంబ సభ్యులు_ హైదరాబాద్/మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతూ, కుటుంబ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత కాలంలో ఐదు తరాల వారసులు ఒకే వేదికపై కలుసుకున్న అపురూప ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్‌లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కుటుంబ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది సభ్యులు ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకున్నారు. ఈ సమ్మేళనంలో 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. సామాన్య నేపథ్యం నుంచి జీవితం ప్రారంభించిన ఈ కుటుంబం, చదువునే ఆయుధంగా మలుచుకుని తరం తరంగా ఎదిగి, నేడు వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు ఎదుర్కొన్న కష్టాలను స్మరించుకుంటూ, నేటి తరాల విజయాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మూలాలను మరువకుండా, విద్య ద్వారా జీవితాన్ని మలుచుకోవచ్చని ఈ కుటుంబం మరోసారి నిరూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. పెద్దల ఆశీస్సులు, చిన్నారుల చలాకితనం కలగలసిన ఈ కార్యక్రమం ఒక మధుర అనుభూతిగా నిలిచింది. ఈ సందర్భంగా కొంతం కిష్టయ్య కుటుంబ వంశవృక్షాన్ని చిత్రరూపంలో ప్రదర్శించారు. అనంతరం ప్రతి కుటుంబ శాఖకు చెందిన సభ్యులు తమ పరిచయాలను చేసుకున్నారు. చిన్నారుల కళా ప్రదర్శనలు, ఆటపాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ సమ్మేళనానికి రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చలిని, ప్రయాణ వ్యయప్రయాసలను లెక్కచేయకుండా కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యుల ఫొటోలు, పరిచయాలతో కూడిన ప్రత్యేక స్మారక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని, తరతరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ పెద్దపల్లి

ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేయాలి: పోతు జ్యోతి రెడ్డి

  మంథని, ఆగస్టు 29: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నేటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలం, అలాగే ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవిధంగా పింఛన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు, రైలు ప్రయాణం హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీల పెద్దలు సైతం ఉద్యమకారుల హామీల అమలుపై అసెంబ్లీలో గొంతెత్తి ఉద్యమకారులకు అండగా ఉంటామని ప్రకటించాలని జ్యోతి రెడ్డి ఆయా పార్టీలను కోరారు.

తెలంగాణ పెద్దపల్లి

గంగాపురి: మల్లెపూల హనుమాన్ ఆలయం నూతన కార్యవర్గం ఎన్నిక

మంథని, ఆగస్టు 16: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలోని మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన అధ్యక్షుడిగా శనివారం బత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గోరంట్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లే రవీందర్, కోశాధికారిగా పుల్లె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా బండి రవి లను ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల కాలపరిమితి 14 ఆగస్టు 2025 నుండి 14 ఆగస్టు 2027 వరకు కొనసాగుతుందని, ఈ కమిటీకి పద్మశాలి కులస్తులందరూ సహకరించినందుకు పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపురి మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు ఈ ఆలయ బాధ్యతలు నమ్మకంతో అప్పగించినందుకు, తమ బాధ్యతను శిరసా వహిస్తూ, అందరి నమ్మకాన్ని వమ్ము చేయమని, తమ కార్యవర్గం దేవాలయ అభివృద్ధి కోసం పాటు పడతామని నూతన దేవాలయ కార్యవర్గం తెలియజేశారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి విద్య విజ్ఞానం

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

*జపాన్ షెటోరియో షికోకాయ్ కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య* మంథని, ఆగస్టు 12; న్యూఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన 19 వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ ద్వారా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన జపాన్ షెటోరియో షికొకాయ్ కరాటే విద్యార్థిని విద్యార్థులు అండర్ 17 అండర్ 14 కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని పట్టణానికి చెందిన విద్యార్థులు అండర్ 17 కుమితే విభాగంలో ఎండీ. తహసిన్ తైభ వెండి పతకం, ఇదే క్రమంలో కథ విభాగంలో కాంస్య పథకం, అండర్ 14 కుమితే విభాగంలో పోగుల శివ సాకేత్ కాంస్య పథకం, బండారి మణికంఠ కథ విభాగంలో కాంస్య పథకం, మారేడుకొండ రిషి కథ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు శిక్షకులు కావేటి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కావేటి సమ్మయ్య మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి మంథని పట్టణంలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. మలేషియాలో బంగారు, వెండి పథకం, హర్యానాలో బంగారు పతకం, మధ్యప్రదేశ్లో బంగారు పతకం, గోవాలో బంగారు పతకం, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థులు సాధించడానికి ఎంతో మంది విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా, పేద విద్యార్థులకు పోటీలకు వెళ్లేటప్పుడు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు సమ్మయ్య పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సహించి, దాతలు సహకరిస్తే, ఇంకా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తానని సమ్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరాటే శిక్షణ కోసం ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు మంథని పట్టణంలోని ఓపెన్ జిమ్ దగ్గర లేదా సమ్మయ్య నివాసం దగ్గర ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 5 గంటలకు, లేదా 9848503412 నంబర్ ను సంప్రదించాలని కావేటి సమ్మయ్య కోరారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను షిటోరియు షికొకాయ్ ఇండియా అధ్యక్షులు, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఢిల్లీ భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శిఖోకాయి రిప్రెజెన్టివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, జడగల శివాని, కాబట్టి శివ గణేష్, మెట్టు హాసిని, కే శ్వేత, నందన, టి హర్షిని, పి హర్షవర్ధన్ లు అభినందించారు.

తెలంగాణ పెద్దపల్లి

గుంజపడుగు: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు 11, పున్నమి ప్రతినిధి: రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం మంథని ప్రాంతంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పి.ఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము లను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్.బి.ఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పి.ఏ.సి.ఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు లాంటి కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ గౌడ్, మంథని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహశీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

*మంథని: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు* మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఈ సమావేశాల్లో అంగన్వాడి ఉపాధ్యాయురాలు మండల సుగుణ పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలే ముద్దని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయు రాలు మండల సుగుణ తో పాటు.. అంగన్వాడి ఆయా రాజేశ్వరి, కాచర్ల కళావతి, కరెంగల రంజిత, పీక శృతి, కట్ల సౌందర్య, మంథిని చైతన్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి; పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు గురువారం పట్టణ పరిధిలోని గోదావరి తీరంలో ప్రత్యేక నమాజు నిర్వహించారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు, ప్రజలకు అల్లా దయ, కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని సాలెహా మజీద్ కు చెందిన ఇమాంసాబ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అనంత కరుణామయుడు అల్లా దయతో ప్రకృతి కటాక్షించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక నమాజులు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా వరుసగా మూడు రోజులు నమాజులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిరోజు చేసే నమాజుకు ఈ ప్రార్థనలు ప్రత్యేకమని వివరించారు. ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు సర్దార్ ఖాన్, మక్బూల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వానాకాలం వచ్చి దాదాపు రెండు నెలలు దాటినా ఇంతవరకు పరిసర ప్రాంతాల్లో సరైన వానలు లేక ప్రజలు అల్లాడుతున్నారని, వర్షాలు లేకుంటే రైతులకు సరైన పంటలు పండక అవస్థలు పడుతున్నారని, అల్లా దయతో వర్షాలు కురిసి, పంటలు పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మంథని పట్టణంలోని సాలెహా మజీద్ కమిటీ అధ్యక్షుడు యాకూబ్, ఆఫిజ్, ఎండీ లతీఫ్, మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలీం ఖాన్, చాంద్, అక్బర్, శంశీర్, షాహిద్, ఐసన్, నిజాం, అంజద్, అజీమ్, హైమద్, బాబా, మోహిన్, పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.