విహార యాత్రలతో విద్యార్థులకు విజ్ఞానం
_మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మీ_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్లోని ప్రముఖ చారిత్రక, విజ్ఞాన కేంద్రాలను విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ యాత్రలో విద్యార్థులు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్లను సందర్శించి ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.గోల్కొండ కోట, చార్మినార్లను సందర్శించిన సందర్భంగా వాటి నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యంపై అవగాహన పొందిన విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. నెహ్రూ జూ పార్క్లో వివిధ జంతువులు, పక్షులను పరిశీలిస్తూ వాటి జీవన విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రయోగాలు, డైనోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను చూసి విద్యార్థులు ఎంతో ఉత్సాహం కనబరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ.. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం చేకూరుతుందని, అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్, దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ, విద్యార్థులు పాల్గొన్నారు.











