గన్నవరం నియోజకవర్గ పున్నమి ప్రతినిధి సురేష్
గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయల్దేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులను నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. గన్నవరం ఎస్.ఎం. కన్వెన్షన్ హాల్లో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూఖ్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మక్కా యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలనే కోరిక కలిగి ఉంటారని తెలిపారు. అలాంటి హజ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారు 1,987 మంది యాత్రకు బయల్దేరగా, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి 353 మంది వెళ్ళటం ఆనందకరమన్నారు. మైనార్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఇమామ్లు మరియు మౌజంలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఆర్థిక పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో హజ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అల్లా కృప రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు.



