41వ వార్డులో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులు
కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల కృషితో వేగం
విశాఖ నగరం 5వ జోన్ పరిధిలోని 41వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ–శ్రీధర్ దంపతుల నిరంతర కృషి ఫలితంగా సుమారు రూ.2 కోట్ల 63 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
సోమవారం జ్ఞానాపురం ప్రాంతంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్లతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టారు. జీవీఎంసీ నిధులతో హిందూ స్మశాన వాటిక వద్ద రక్షణ గోడ, సీసీ కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.185.08 లక్షలు, కొండవీటి గడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.78.81 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే జెఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో రూ.24.85 లక్షలతో నిర్మించిన జీవీఎంసీ నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు ప్రతిపాదించడంలో కార్పొరేటర్ పూర్ణిమ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దక్షిణ నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. త్వరలో ఎండోమెంట్కు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనతా బజార్, నెహ్రూ బజార్, పూర్ణ మార్కెట్, ఎస్ఎల్ కెనాల్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న మేయర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు, 41వ వార్డు కూటమి అధ్యక్షులు అంతోని శేఖర్, మదు, సంజీవరావు, కూటమి నేతలు సునీత, గవర రమణ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకంగా 41వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల వెనుక కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల చొరవ, సమన్వయం కీలకంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.


