ఏన్కూరు న్యూస్
ఏన్కూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం రోజు కూడా మార్కెట్ యధావిధిగా నడుస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారాంతంలో మార్కెట్ మూసివేయాలి. కానీ ఆదివారం కూడా వ్యాపార లావాదేవీలు కొనసాగించడం వలన హమాలీలకు విశ్రాంతి దొరకడం లేదు.
మార్కెట్ యార్డులో వరుసగా పంటల రవాణా, తూకం పనులు, బస్తాల మోసే పనుల్లో నిత్యం కష్టపడుతున్న హమాలీలు విశ్రాంతి లేకుండా పనులు చేసి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దళారుల ఒత్తిడి వల్లనే అధికారులు మార్కెట్ను మూసివేయకుండా తెరిచి ఉంచారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు తమ లాభాల కోసం హమాలీలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కార్మికుల ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. వారానికి ఒకరోజైనా విశ్రాంతి అవసరం. కానీ మార్కెట్ మూసే అవకాశం ఇవ్వడం లేదు. పనిలో గాయాలు, అలసటతో ఇబ్బంది పడుతున్నాం” అని ఒక హమాలి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయం పై మార్కెట్ కమిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, దళారుల ఆధిపత్యాన్ని తగ్గించి హమాలీలకు భద్రత, విశ్రాంతి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దళారుల లాభాల కోసం కార్మికుల ప్రాణాలతో ఆడుకోవడం ఎప్పుడు ఆగుతుంది?
హమాలీల శ్రమకు గౌరవం ఇవ్వడం ఎప్పుడు మొదలవుతుంది?
ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వం, మార్కెట్ కమిటీ అధికారులు వెంటనే దృష్టి సారించాలని హమాలీలు కోరుతున్నారు.


