ఖమ్మం డిసెంబర్
(పున్నమి జిల్లా ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా పర్యటనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 24వ తేదీ బుధవారం నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో నిర్వహించనున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రామచంద్ర రావు హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో పర్యటన రద్దైనట్లు సమాచారం.
ఇదే సమయంలో సిరి గోల్డ్ వ్యవహారంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కుసంపూడి రవీందర్లపై బాధితుడు యాస నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్ర రావు ఖమ్మం పర్యటనకు వస్తే మీడియా ప్రతినిధులు సిరి గోల్డ్ అంశంపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉండటంతో, సమాధానాలపై ఒత్తిడి తప్పించుకునేందుకే పర్యటనను రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, సిరి గోల్డ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుల నుంచి తెప్పించుకునే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నుంచి రాజీనామా కోరడం లేదా పార్టీ నుంచి బహిష్కరణ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా బీజేపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయా అన్నది వేచి చూడాల్సిందే.


