సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తా గంటా…
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
ఉన్నతాధికారులకు పంపినంత మాత్రాన పిర్యాదులు పరిష్కారమైనట్టు కాదు..
గ్రీవెన్స్ లో అధికారుల తీరు పట్ల గంటా అసంతృప్తి
_మధురవాడ(డి డి న్యూస్) :_ వచ్చే వారం నుంచి గ్రీవెన్స్ నిర్వహణకు ముందురోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. పార్కులు, ఓపెన్ స్పేస్ లు, గెడ్డలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను.. అనధికార నిర్మాణాలను.. స్వయంగా పరిశీలిస్తానని తెలియజేశారు. పిర్యాదుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, విద్యుత్, రెవిన్యూ తదితర విభాగాల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రజా పిర్యాదులను పై అధికారులకు పంపించి పరిష్కారమైన జాబితాలో చూపించడం సరి కాదన్నారు. గ్రీవెన్స్ మొక్కుబడిగా జరగకుండా నివేదికల ఫార్మెట్ మార్చమని అధికారులను ఆదేశించారు. అధికారులు ఏ లెక్కలు చెప్పినా ఆశించినంతగా పిర్యాదుల పరిష్కారం జరగడం లేదని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా.. ఇంకా అనేక సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకడం లేదన్నారు. మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు కూడా గ్రీవెన్స్ నిర్వహించనున్నామని వివరించారు. గ్రీవెన్స్ లో వచ్చే పిర్యాదులపై ఇక మీదట సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన తప్పనిసరన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, మొల్లి హేమలత, లొడగల అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


