మోంథా’ తుఫాను ప్రభావం: పునరావాస కేంద్రం సిద్ధం
-చిట్వేల్ జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాట్లు పూర్తి: ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు వెల్లడి
-అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ప్రజలకు అధికారుల విజ్ఞప్తి**
చిట్వేల్, అక్టోబరు 27: పున్నమి ప్రతినిధి
‘మోంథా’ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలో పునరావాస కేంద్రం సిద్ధమైంది. చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) నందు తుఫాను పునరావాస కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు తెలిపారు.
-అసత్య ప్రచారాలు నమ్మొద్దు:
ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ, మోంథా తుఫాను గురించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారుల ద్వారా జారీ చేయబడిన అధికారిక వార్తలనే నమ్మాలని సూచించారు. “తుఫాను పరిస్థితులు చక్కబడే వరకూ ప్రజలు సురక్షిత నివాసాలలోనే ఉండాలి. అత్యవసరమైన ముఖ్యమైన పనులుంటేనే బయటకు రావాలి. ప్రభుత్వ అధికారుల నుండి వచ్చే సూచనలను తప్పక పాటించాలి” అని ఆయన ప్రజలకు తెలియజేశారు.
-ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం:
పాఠశాల ఎన్.సి.సి. అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, చిట్వేల్ మండలంలోని ప్రజలందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు.
-సహాయానికి ఉపాధ్యాయులు సిద్ధం:
మండల విద్యా శాఖ అధికారులు మాట్లాడుతూ, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధితులకు తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు అండగా ఉండేందుకు విద్యా శాఖ సిబ్బంది తమ వంతు సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
-పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు:
తుఫాను బాధితులకు అవసరమయ్యే తరగతి గదులను, మరుగుదొడ్లను పాఠశాల పారిశుద్ధ్య ఆయాలు మరియు వాచ్మెన్లచే శుభ్రం చేయించారు. పునరావాస బాధితుల కోసం మంచినీటిని క్యాన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది చెన్నయ్య, సుహాసిని, కిరణ్ కుమార్ రాజు, ఆయాల బృందం, వాచ్మెన్ వెంకట రెడ్డి పాల్గొన్నారు.అధికారులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


