సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
తక్కువ రోగనిరోధక శక్తి, దీర్ఘకాలిక వ్యాధులుంటే సమస్యే – జ్వరం, దగ్గు, పుండ్లు కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తురకపాలెంలో ‘మొలియాయిడోసిస్’ వ్యాధి వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలు, పరీక్షలు నిర్వహించింది. అసలు మొలియాయిడోసిన్ వ్యాధి అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర వివరాలు తెలుసుకుందాం!
మెలియాయిడోసిస్ అంటే : బర్ఖోల్డేరియా సూడోమల్లె అనే గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి నేరుగా సోకుదు. జంతువుల నుంచి మనుషులకు నేరుగా సోకడమనేదీ అరుదుగా జరుగుతుందంటున్నారు నిపుణులు. అయితే, కలుషితమైన నేల, నీటిలో ఈ బ్యాక్టీరియా సంవత్సరాల పాటు జీవించగలదని పేర్కొన్నారు.
మెలియాయిడోసిస్ రుతుపవనాల ఆధారిత వ్యాధి. సుమారు 75-85 శాతం కేసులు వర్షాకాలంలో సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు చాలా విస్తృతంగా ఉంటాయని, ముఖ్యంగా ఊపిరితిత్తులు గట్టిపడటం, ఒక ప్రాంతంలో చీము గడ్డలు ఏర్పడటం నుంచి వేగంగా ప్రాణాంతకమయ్యే సెప్టిసిమియా (రక్తంలో ఇన్ఫెక్షన్) వరకు ఉండవచ్చని National Centre for Disease Control అధ్యయనంలో పేర్కొంది. ఈ వ్యాధి ఆగ్నేయ ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది. ఇది బయోటెర్రరిజం ఏజెంట్లలో కేటగిరీ B కింద వర్గీకరించబడిందని తెలిపింది. ఇందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదంటున్నారు నిపుణులు.
వ్యాప్తికి అవకాశాలు :
మెలియోయిడోసిస్ కలుషితమైన నేల, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని cdc.gov అధ్యయనంలో తేలింది.
మేకలు, గొర్రెలు, పందులు వంటి వాటిలో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది.
పశువులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, పక్షులు, గుర్రాలు, కంచర గాడిదలు, జింకలు, ఒంటెలు, సరీసృపాలు వంటి ఇతర ప్రభావిత జాతులు ఉన్నాయి.
మెలియాయిడోసిస్ బారినపడిన జంతువులు, నేలపై, నీటిలో తిరిగితే, ఆ మట్టిని లేదా నీటిని మనుషులు తాకినప్పుడు లేదా శుద్ధి చేయకుండా తాగితే ఇన్ఫెక్ట్ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి శరీరంలో గాయాలున్నచోట నుంచి ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుందంటున్నారు.
ఈ వ్యాధి బారినపడితే సాధారణంగా కనిపించేది పల్మనరీ ఇన్ఫెక్షన్ ఒకటి. ఇది బ్రాంకైటిస్ లాగా తేలికపాటిది కావచ్చని లేదా న్యుమోనియాతో తీవ్రమైనదీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
clevelandclinic అధ్యయనం ప్రకారం, లక్షణాలు :
దగ్గు
శ్వాస ఆడకపోవడం
ఛాతి నొప్పి
అలసట
జ్వరం
ఆకలి లేకపోవడం
తలనొప్పి
విపరీతమైన అలసట
పొత్తి కడుపు నొప్పి
కీళ్ల నొప్పి
గందరగోళం, దిక్కుతోచని స్థితి
జంతువుల్లో మెలియాయిడోసిస్ను గుర్తించినట్లుగా పరిశోధనలు పెద్దగా లేవు. కానీ, ఇతర దేశాల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పందుల్లో మెలియాయిడోసిస్ వ్యాధి కారక బ్యాక్టీరియాను గుర్తించినట్టు నివేదికలు ఉన్నాయి. వర్షాలు పడ్డ తరువాత పర్యావరణ నమూనాలతో పాటు అనుమానిత జంతువులను పరీక్షించాలి. ఈ వ్యాధిని ఏదైనా జంతువుల్లో గుర్తించగలిగితే అవి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా సహాయపడుతుంది. దీంతో సరైన చర్యలు చేపట్టి మనుషులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడొచ్చు. – ప్రొఫెసర్ డాక్టర్ పి.ఆనంద్కుమార్, పశువైద్య సూక్ష్మ జీవశాస్త్ర విభాగం, ఎన్టీఆర్ పశువైద్య కళాశాల, గన్నవరం, ఆంధ్రప్రదేశ్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
కలుషితమైన నీటిని తాగకపోవటం.
చర్మంపై గాయాలున్నప్పుడు మట్టి లేదా నీటికి దూరంగా ఉండటం.
వర్షాకాలం, తుపాన్ల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండటం.
స్థానికంగా చుట్టుపక్కల ఉండే పశుగణాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వాటికి పరీక్షలు చేయాలి. ర్యాండమ్ పరీక్షలతో స్పష్టత రావచ్చు.
cdc.gov అధ్యయనం ప్రకారం, ఎవరిపై ఎక్కువ ప్రభావం :
డయాబెటిస్
అధికంగా మద్యం వాడటం
కాలేయ వ్యాధి
కిడ్నీ వ్యాధి
తలసేమియా (రక్త రుగ్మత)
క్యాన్సర్, లేదా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే మరొక పరిస్థితి
దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, సిస్టిక్ ఫైబ్రోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD), బ్రాంకియక్టాసిస్
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.


