*మహిళల స్వయం సాధికారతకు దోహదపడేలా సరస్ ఎగ్జిబిషన్*
*600 మంది ఎస్.హెచ్.జి. సభ్యుల ఆధ్వర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు
*డిసెంబర్ 15 నుంచి 26 వరకు నిరంతరాయంగా కార్యక్రమ నిర్వహణ
*విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
*విశాఖపట్టణం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* మహిళల స్వయం సాధికారతకు దోహదపడేలా సరస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ సరస్ ప్రదర్శన–2025 డిసెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ, ఇతర అంశాల గురించి వివరించారు. పండగల సమయం, ప్రజల రాకపోకలు అధికంగా ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఆదాయ వనరులను పెంపొందించడం, గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
*600 మంది ఎస్.హెచ్.జి. సభ్యుల ఆధ్వర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు*
ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది ఎస్.హెచ్.జి. మహిళలు పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం 250 స్టాళ్లలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, మసాలాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు తదితర నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. దీని ద్వారా విశాఖవాసులకు దేశంలోని వివిధ రాష్ట్రాల నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు ఒకేచోట లభించనున్నాయన్నారు. అదనంగా ఫుడ్ స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వినోద ఆటపరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్.హెచ్.జి. మహిళలకు ఉచిత స్టాళ్లు, ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే పోలీస్ భద్రత, సీసీ కెమెరాల నిఘా, అగ్నిమాపక సదుపాయాలు, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, జనరేటర్ వంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
*మద్దతుగా నిలుస్తూ.. విజయవంతం చేయాలి…*
ఈ ప్రదర్శనకు ఎన్.ఆర్.ఎల్.ఎం., సెర్ప్, నాబార్డు, మెప్మా, ఆర్.వై.ఎస్.ఎస్.తో పాటు ఎస్.బి.ఐ., యు.బి.ఐ., పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏపీ గ్రామీణ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్, ఐవోసీఎల్, గాయత్రీ విద్యాపరిషత్ తదితర సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారతకు దోహదపడే ఈ ప్రాంతీయ సరస్ ప్రదర్శనను విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేసి స్వయం సహాయక సంఘాల వారికి ప్రోత్సాహం అందించాలని, విజయవంతం చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతర డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఇతర అధికారులతో కలిసి సంబంధిత పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.


