పున్నమి ప్రతి నిధి
బీసీ బంద్ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ దాడిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయ్, బీజేపీ నాయకుడు నాయుడు రాఘవ గాయపడినట్లు సమాచారం. గాయపడిన నాయకులను బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రిలో పరామర్శించి, వారికి పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనమవడంతో ప్రజల మద్దతు కోల్పోయింది. అందుకే భయంతో దాడులకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ఇది అంగీకారయోగ్యం కాదు. దాడికి పాల్పడిన వారిపై పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి” అని హెచ్చరించారు.
ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి రమేష్, సుదర్శన్ మిశ్ర, వీరమ్రాజు నంబూరి రామలింగేశ్వరరావు, దొంగల సత్యనారాయణ, గుత్త వెంకటేశ్వర్లు, బోయినపల్లి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, బీసీ హక్కుల కోసం జరుగుతున్న న్యాయమైన బంద్కి బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని, ప్రజల సమస్యలను అణగదొక్కే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా బంద్ నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు హింసకు తెగబడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడిచి, బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, ప్రజాస్వామ్య హక్కులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.


