సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించి నోటీసులు ఇచ్చిన విషయం రాజకీయంగా వివాదాస్పదం అయింది. వీరికి పెన్షన్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం అధికారులకు స్పష్టత ఇచ్చింది. నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ పెన్షన్లు ప్రతీ నెలా తరహా లోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబరు ఒకటో తేదీన 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.2746.52 కోట్ల నిధులు గ్రామ, వార్డ్ సచివాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. అలాగే, పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. మండలంలోని బోయనపల్లెలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం దోబీఘాట్లో రజకులతో మాటాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లెలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు.


