*పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత*
*ఆటోనగర్, మధురవాడ పార్కుల్లో బస్టాప్ ల ఏర్పాటుకు చర్యలు
*డీఐఈపీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకోవాలని, ఆటోనగర్, మధురవాడ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల్లో పని చేసే కార్మికుల సౌకర్యార్థం బస్టాప్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా గతంలోని అజెండా అంశాలపై తీసుకున్న చర్యల గురించి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి. ఆదిశేషు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన పారిశ్రామిక ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, పవర్ లైన్లు తదితర వసతులు కల్పించాలని, వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ అధికారుల సహాయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.) పనుల్లో వేగం పెంచాలని, జూన్ తొలివారం నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ & బి అధికారులను ఆదేశించారు. ఆటోనగర్ బి, డి, బ్లాకుల్లో ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని చెప్పారు.
కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో తాగునీటి వసతి కోసం ఐలా ఛైర్మన్ నివేదించగా తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీఎంఈజీపీలో భాగంగా ఎక్కువ ప్రాజెక్టులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చే అంశంపై యువతలో ప్రచారం కల్పించాలని, స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగిన ప్రాంతాల్లో ఆరు నెలల లోపు పరిశ్రమలు నెలకొల్పాలని, లేదంటే నోటీసులు జారీ చేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నానోపార్కు, ఎంఎస్ఎంసీ పార్కుల ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించాలని, ఇటీవల సినర్జీ అనే కంపెనీలో అనుకోని కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన బాధితులకు ఎం.ఎస్.ఎం.ఈ. పార్కుల్లో ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ జడ్.ఎం. సింహాచలం, ఐలా ప్రతినిధులు, పారిశ్రామకవేత్తలు, ఇతర విభాగాల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


