వింజమూరు మండలం నందిగుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పోషకాహార విలువలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎమ్మెల్యే సురేష్ గారు స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భోజనం తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, వడ్డింపు విధానాన్ని పరిశీలించి ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని సూచించారు.
అలాగే పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఉపాధ్యాయులు, అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా రహదారి దాటే సమయంలో విద్యార్థుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, తగిన పర్యవేక్షణ అవసరమని సూచించారు.
ఈ తనిఖీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం, సురక్షిత వాతావరణం కల్పించడంపై తన కట్టుబాటును ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు.



