పెద్దవుటపల్లి: పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణా జిల్లా,గన్నవరం మండలం పరిధిలోని పెద్దవుటపల్లి నుంచి తెంపెల్లి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో పేరుకుపోయిన చెత్త ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఊరిలోని వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేయడం వల్ల కుళ్లిపోయిన కూరగాయలు,పండ్లు,ఇతర వ్యర్థాల నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసనతో ఆ మార్గంలో ప్రయాణించే స్థానికులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
స్థానికంగా నివసించే ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటూ, ఈ చెత్త కుప్పల వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం?
స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమస్య గురించి పెద్దవుటపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించినప్పటికీ,వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా,పంచాయతీ సిబ్బందే ఊర్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఈ రోడ్డు వద్ద వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పక్కన భారీ స్థాయిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని వారు వాపోతున్నారు.
స్థానిక ప్రజల డిమాండ్ చెత్త నుంచి వస్తున్న ఈ భయంకరమైన వాసనతో మా జీవితాలు దుర్భరంగా మారాయి. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు, ప్రజారోగ్య సమస్య కూడా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే దృష్టి సారించి,ఈ చెత్తను ఇక్కడి నుంచి తొలగించి, గ్రామంలో శాశ్వత చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,ప్రజల ఇబ్బందులను తొలగించి,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దవుటపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.


