
దసరా పండుగ, దుర్గోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగలు శాంతియుతంగా, సాంప్రదాయ భక్తి వాతావరణంలో జరగాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, పండుగలలో ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ పాటిస్తూ పోలీస్ శాఖతో సహకరించాలన్నారు.
పర్మిషన్ విధానం:
పందిర్లు వేసుకోవడం, దుర్గా మాత విగ్రహాలు ప్రతిష్టించడం వంటి కార్యక్రమాల కోసం ప్రతీ కమిటీ, సంఘం, భక్తులు తప్పనిసరిగా సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్ (https://durgautsav.net/) ద్వారా ముందుగా అనుమతి పొందాలని తెలిపారు. అనుమతి లేకుండా పందిర్లు, విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
DJ సౌండ్స్, అసభ్యకర నృత్యాలకు నిషేధం:
పండుగల సందర్భంగా DJ Sounds కు ఎటువంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే అసభ్యకర నృత్యాలు, అనుచిత వినోదాలు పూర్తిగా నిషేధించబడ్డాయని గుర్తుచేశారు.
ప్రజా శాంతి భద్రతా చర్యలు:
ప్రజలు పండుగలలో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై అడ్డంకులు సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. పందిర్లు, మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రివేళల్లో నిర్దిష్ట సమయాల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి:
భక్తులు, ప్రజలు దసరా పండుగను ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే Dial 112 లేదా పెందుర్తి పోలీస్ స్టేషన్ (PH: 96767973147) కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పండుగ ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రతా చర్యలు మరింత బలోపేతం అవుతాయి అని అన్నారు.
సహకారం అవసరం:
“ప్రతి భక్తుడు, ప్రతి కమిటీ పోలీసులకు సహకరిస్తేనే ఈ దుర్గోత్సవం శాంతియుతంగా, సాంప్రదాయ భక్తి వాతావరణంలో విజయవంతంగా జరుగుతుంది” అని ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆకాంక్షించారు.

