మర్రిపాడు (పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వందలాది యాదవ సోదరులు తరలి రావడంతో మండల కేంద్రం సందడిగా మారింది. తాసిల్దార్ ఆఫీస్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ పి.ఎన్.ఆర్ బృందావనం గార్డెన్స్ వరకు అద్భుతంగా కొనసాగింది. బాణాసంచాలు, నృత్యాలు, సంఘ జెండాలు, నినాదాలతో సాగిన ప్రదర్శన స్థానికుల దృష్టిని ఆకట్టుకుంది.
బృందావనంలో ఉసిరి చెట్టు, శివలింగానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అనంతరం వనభోజనం ఏర్పాటు చేసి సంఘసభ్యులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన యాదవ సంఘం పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు నిర్వాహకులను
అభినందించారు. బొమ్మి రాదయ్య మాట్లాడుతూ యాదవ సమాజ అభివృద్ధికి విద్య, ఐక్యత, పరస్పర సహకారం అత్యవసరమని పిలుపునిచ్చారు. జిల్లా యాదవ సంఘం ఆఫీసు ఏర్పాటు చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, మండల యాదవ సంఘం కమిటీలు, యువజన విభాగం కీలకపాత్ర పోషించాయి. మాజీ జెడ్పిటిసి చైర్మన్ చెంచలబాబు యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.


