దశ.. దిశ మారనున్న మెట్రో
-ఎల్అండ్టీ కథ ముగింపు
– ప్రభుత్వమే ముందడుగు
* పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి*
హైదరాబాద్ మహానగరంలో ఎల్అండ్టీ మెట్రో అధ్యాయం ముగిసింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలోనే తొలిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగనుంది.
2010లో ప్రారంభమైన ప్రయాణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో 2010లో ఎల్అండ్టీతో మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరింది. అంతకు ముందు సత్యం అనుబంధ సంస్థ మేటాస్ ఇన్ఫ్రాకి ప్రాజెక్టు అప్పగించగా, సత్యం సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. దీంతో ఎల్అండ్టీ ముందుకొచ్చి, ఇది దేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద PPP ప్రాజెక్టుగా రికార్డుల్లో నిలిచింది.
2017లో ప్రజలకు అందుబాటులోకి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబర్ 29న మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా మూడు కారిడార్లలో 69 కి.మీ. మేరకు రైళ్లు నడపబడ్డాయి. ఉప్పల్, మియాపూర్లో డిపోలు నిర్మించబడ్డాయి.
కరోనా దెబ్బ
2020లో కరోనా మహమ్మారి కారణంగా 169 రోజుల పాటు మెట్రో నిలిచిపోవడం ఎల్అండ్టీకి పెద్ద ఎదురుదెబ్బ అయింది. అప్పట్లో తీసుకున్న రుణాలు, వడ్డీ భారం, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. అప్పుల ఊబిలో నుండి బయటపడలేక సంస్థ ప్రభుత్వ సహకారం కోరినా, ఆశించిన సాయం రాకపోవడంతో చివరికి ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని అంగీకరించింది.
రెండో దశకు మార్గం సుగమం
ఎల్అండ్టీ తప్పుకోవడంతో రెండో దశ మెట్రో విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే మొదటి విడతలో నిర్మించిన 69.2 కి.మీ. కారిడార్లను ప్రభుత్వమే నిర్వహించనుందా? లేక ఎల్అండ్టీకి ఈక్విటీ వాటా కొనసాగుతుందా? అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైటెక్సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మూసారాంబాగ్లో నిర్మించిన మాల్స్ నిర్వహణపై నిర్ణయం కీలకం కానుంది.
కొత్త దిశలో మెట్రో
ఇకపై ప్రభుత్వమే మెట్రో బాధ్యతలు చేపట్టనుండటంతో రెండో దశ డీపీఆర్ అనుమతులకు కూడా మార్గం సుగమమైంది. ప్రయాణికులకు ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
హైదరాబాద్ మెట్రో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఎల్అండ్టీ ప్రయాణం ముగిసినా – మెట్రోకు కొత్త దిశ మొదలైంది.
హైదరాబాద్ మెట్రో టైమ్లైన్
2008 → మేటాస్ ఇన్ఫ్రా ప్రతిపాదన (సత్యం సంక్షోభంతో ఆగింది)
2010 సెప్టెంబర్ 4 → ఎల్అండ్టీతో PPP ఒప్పందం
2017 నవంబర్ 29 → ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో సేవలు ప్రారంభం
2017–2019 → మూడు కారిడార్లలో మొత్తం 69.2 కి.మీ. పూర్తి
2020 → కరోనా కారణంగా 169 రోజులు మెట్రో నిలిపివేత
2021–2024 → అప్పుల ఊబి, ఆర్థిక ఇబ్బందులు – ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తులు
2025 → ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ ఎగ్జిట్ – ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు స్వీకరణ


