*జాగ్రత్తగా ఉండండి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు…*
*మొంథా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన స్పెషల్ సీఎస్ అజయ్ జైన్
*అనవసర ప్రయాణాలు చేయొద్దని, సముద్ర తీరానికి వెళ్లొద్దని కలెక్టర్ విజ్ఞప్తి
విశాఖపట్టం, అక్టోబర్ 27 ః మొంథా తుపాను తీవ్రత ఎక్కువని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ సూచించారు. శిథిల భవనాల్లో, నిర్మాణ దశల్లో ఉన్న భవనాల్లో ఉండరాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైక్లోన్ సెంటర్లకు గానీ, పునరావాస కేంద్రాలకు గానీ వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో సోమవారం సాయంత్రం విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తో కలిసి అజయ్ జైన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, సన్నద్దత గురించి వివరించారు. మొంథా సోమవారం సాయంత్రం నాటికి విశాఖపట్టణానికి 560 కి.మీ. ఆగ్నేయ దిశలో ఉందని, గంటకు 19 కి.మీ. వేగంతో తీరానికి వస్తోందని పేర్కొన్నారు. 28వ తేదీ అర్థరాత్రి గానీ, 29వ తేదీ తెల్లవారు ఝామున గానీ తుపాను తీరం దాటుతుందని చెప్పారు. ప్రస్తుతానికి కాకినాడ పశ్చిమ దిశలో తీరం దాటే అవకాశం ఉందని, అయితే దిశ మారొచ్చని అజయ్ జైన్ స్పష్టం చేశారు. కోస్తా తీరంలో 17 నుంచి 19 జిల్లాలు ప్రభావితం కానున్నాయని, వాటిలో 9 జిల్లాలో తీవ్రంగా ప్రభావితం అవుతాయని, వాటిలో 87 మండలాలు, 705 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. 16 అర్బన్ ప్రాంతాలు కూడా ప్రభావం అవుతున్నాయని వివరించారు.
శ్రీకాకుళం నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి వరకు తొమ్మిది జిల్లాల పరిధిలో 1,058 పునరావాస కేంద్రాలను గుర్తించామని, వాటిల్లోకి 32,467 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడ తాగునీరు, టాయిలెట్లు, మందులు, చిన్నపిల్లలకు పాలు, ఆహారం వంటి వసతులు సమకూరుస్తున్నామని వెల్లడించారు. సహాయక చర్యల నిమిత్తం ఆరు ఎన్టీఆర్ఎఫ్, ఐదు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 13 వేల స్తంభాలు అందుబాటులో ఉంచామన్నారు. అందరూ కలిసి సుమారు 6వేల మంది వరకు సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు. ఈ క్రమంలో కోస్తా తీరంలోని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని, హోర్డింగులు తొలగించాలని, మ్యాన్ హోల్స్ ను సరిచేయాలని చెప్పామని గుర్తు చేశారు. జలాశాయాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. 27వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 4.7 సెం.మీ. వర్ష పాతం నమోదైందని పేర్కొన్నారు. రాబోయే 38 నుంచి 46 గంటలు చాలా కీలకమని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
*కొండవాలు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలి ః జిల్లా కలెక్టర్*
ఈ రెండు రోజులూ అనవసర ప్రయాణాలు చేయరాదని, తీర ప్రాంతాలను సందర్శించవద్దని విశాఖ ప్రజలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపనున్న కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కొండవాలు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెం.0891-2590100, 0891-2590102లను సంప్రదించాలని సూచించారు. అలాగే జీవీఎంసీ పరిధిలోని వాట్సాప్ నెం.96669 09192ను కూడా అనుసరించి సహాయం పొందవచ్చని చెప్పారు. 11 మండలాల పరిధిలో 15 తీర ప్రాంత గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని, ఈ క్రమంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 500 స్తంభాలు అందుబాటులో ఉన్నాయని, 430 మంది సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. గోస్తనీ, మేఘాద్రి గెడ్డ, గంభీరం రిజర్వాయర్ల వద్ద ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని సచివాలయాల సిబ్బంది పర్యవేక్షణలో పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, మందులు, ఇతర వసతులు సమకూర్చామని చెప్పారు. ఇండియన్ నేవీ సహాయం కోరామని, హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచాలని చెప్పామన్నారు. అలాగే ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి 90 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.


