జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మసీద్ సెంటర్ వద్ద నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు నేరుగా అందించడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత సమర్థంగా చేరుతున్నాయో ఈ కార్యక్రమం స్పష్టంగా చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్కరూ కూడా ప్రభుత్వ సహాయం నుండి దూరం కాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు.
పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిజంగా అమలవుతున్నాయనే విషయానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నెట్టెం శివరామ్, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కోరకుటి సైదులు, 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరకుటి బొబ్బిలి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




