-యల్లంరాజు చెరువు గట్టు, గుంజనేరు ఉద్ధృతి పరిశీలన; ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: శ్రీనివాసులు సూచన
చిట్వేల్, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో భారీ వర్షాల ప్రభావంతో తలెత్తే పరిస్థితులను అంచనా వేసేందుకు ఎంపీడీవో శ్రీనివాసులు బుధవారం లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల భద్రత, ఆస్తి నష్టం నివారణ లక్ష్యంగా ఆయన చెరువులు, కుంటలు, నదుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
-యల్లంరాజు చెరువు పరిస్థితి సమీక్ష
రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన యల్లంరాజు చెరువును ఆయన సందర్శించారు. అక్కడ నీటి మట్టం, చెరువు గట్టుల స్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. మైలపల్లి, రాచపల్లి ప్రాంతాల వద్ద ఉన్న అలుగువంక ఉద్ధృతిని గమనించి, ముంపు ప్రమాదాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
-ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలకు హెచ్చరిక
ముఖ్యంగా గుంజనేరు నది ప్రవాహం ప్రభావం చూపే అవకాశం ఉన్న తుమ్మకొండ మరియు నగిరిపాడు గ్రామ పంచాయతీల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సూచించారు.
-ముందస్తు జాగ్రత్తలపై ఎంపీడీవో ఆదేశాలు
ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందస్తుగా ఆహార పదార్థాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.అలాగే, మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూమ్కి చేరవేయాలి.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అవసరమైన యంత్రాలు (పంపులు, జె.సి.బి.లు వంటివి), సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.ఈ పర్యటనలో ఎంపీడీవో వెంట డిప్యూటీ ఎంపీడీవో రమణ, సీనియర్ సహాయకుడు సుబ్బారాయుడు పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ సునీల్కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


