చిట్వేల్ మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. “నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం” అని ప్రిన్సిపాల్ తులసి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడపిల్లలకు ఉచితంగా సమగ్ర విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును మెరుగుపరచడమే ఈ విద్యాలయ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.
ఈ విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో 13 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు, 9వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్లో ఎంపీసీ (ఇంగ్లీష్ మీడియం) కోర్సుకు 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సీట్లు పరిమితంగా ఉన్నందున అర్హులైన విద్యార్థినులు తక్షణమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యార్థినుల కోసం పాఠశాలలో క్రమబద్ధమైన రోజువారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5:30 గంటలకు యోగా, 7 గంటలకు రాగి మాల్ట్, 7:30 నుండి 8:30 వరకు ఉదయం అధ్యయనం, 8:30కు అల్పాహారం, 9 గంటలకు ప్రార్థన అనంతరం 9:15 నుండి సాయంత్రం 4:15 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:15కు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. సాయంత్రం 4:15కి బూస్ట్, స్నాక్స్, రాత్రి 6 నుండి 9 వరకు నైట్ స్టడీ అవర్స్, 7 గంటలకు భోజనం వంటి సదుపాయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థినుల సంక్షేమం కోసం పాఠశాలలో ఉచితంగా పరుపులు, దుప్పట్లు, శానిటరీ నాప్కిన్స్, సోలార్ గీజర్ ద్వారా వేడి నీరు, డిజిటల్ విద్యా సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదనంగా యూనిఫాం, బ్యాగ్, షూస్, పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థినికి రూ.1000 కాస్మెటిక్ ఖర్చుల కోసం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
కేవలం పాఠ్య విద్య మాత్రమే కాకుండా, వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థినులను స్వయం సమర్థులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రాప్అవుట్ బాలికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.ఆడపిల్లల భద్రత, ఆరోగ్యం, నాణ్యమైన విద్య కలగలిపి సమగ్ర అభివృద్ధి సాధించడమే కేజీబీవీల ప్రధాన లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను విద్యాబోధనలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు. విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
అడ్మిషన్లు పరిమితంగా ఉన్నందున ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తులసి మరోసారి విజ్ఞప్తి చేశారు.






