ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచిన చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు అధికారుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి, చిట్వేలు మండలాన్ని అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లా లోకి చేర్చిన పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న బోర్డును మార్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
బోర్డుపై పాత జిల్లా పేరే..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యాలయం మరియు పాఠశాల బోర్డులపై జిల్లా పేరును సవరించాల్సి ఉంది. కానీ ఈ పాఠశాల బోర్డుపై నేటికీ పాత జిల్లా పేరే దర్శనమిస్తోంది. పాఠశాల పరిపాలన యంత్రాంగం కనీసం బోర్డును మార్చే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపాధ్యాయుల తీరుపై ‘గుసగుసలు’:
పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు పెట్టింది పేరైన ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని, దీనికి ఉపాధ్యాయుల అలసత్వమే కారణమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
తక్షణ చర్యలు అవసరం:
పాఠశాల బోర్డును వెంటనే మార్చాలని, అలాగే ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెంచి పాఠశాల పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.





