అనకాపల్లి జిల్లా, జనవరి 30 పున్నమి న్యూస్ ప్రతి నిధి ఆనంద్ :
ఏటికొప్పాక గ్రామపంచాయతీ పరిధిలో వేదంతా మహాశక్తి ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అపోలో డాటర్స్ వైద్య బృందం ఏర్పాటు చేసింది. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, కంటి సమస్యలు, మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ నాయుడు మాస్టారు, ఈసరుపు శ్రీను, అన్నం సరోజీరావు, పంచాయతీ గుమస్తా నాగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించారు. దాదాపు 200 మంది వరకు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ మెడికల్ క్యాంపును గ్రామ సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.



