అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో బుధవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) తన ఇద్దరు చిన్నారులను విషం తాగించి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల ప్రకారం — చంటి భార్య నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా, ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ, బుధవారం రాత్రి అయిదవ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్ (11), ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్ (8) లకు పురుగుమందు తాగించి, అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకుని చంటి ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి. నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


