కామారెడ్డి:, 18 నవంబర్ పున్నమి ప్రతినిధి :
జిల్లా పోలీస్ శాఖ ప్రతీ నెల 150కుపైగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ, బాధితులకు వీటిని తిరిగి అందజేస్తోంది. ఇప్పటి వరకూ ఈ సంవత్సరం మొత్తం 1,722 మొబైల్ ఫోన్లు సుమారు రూ. 2.75 కోట్ల విలువైనవి రికవరీ చేసి, యజమానులకు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు.ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 143 మొబైల్ ఫోన్లు (మొత్తం విలువ ₹23 లక్షలు) తిరిగి రికవరీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులకు ప్రత్యేక బృందంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో RSI బలరాజు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని ఎస్పీ వివరించారు. రికవరీలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.ఎస్పీ గారు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరమైనదని, అందులో ఉన్న వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు వంటి సమాచారం ఆర్థిక మరియు వ్యక్తిగత భద్రతకు కీలకమని తెలిపారు.మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం, సిమ్ బ్లాక్ చేసి CEIR వెబ్సైట్ ద్వారా IMEI నంబర్ బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని సూచించారు.జిల్లాలో CEIR పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 4,169 ఫోన్లు (రూ. 6.67 కోట్ల విలువ) రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందదలచిన బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI శ్రీ బాలరాజు (8712686114) గారిని సంప్రదించి, సంబంధిత ధ్రవీకరణ పత్రాలు చూపి తమ మొబైల్ స్వీకరించవచ్చని తెలిపారు.


