ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి మంగళవారం నాడు ఢిల్లీలో గూగుల్ ప్రతినిధులతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం కుదిరిన వెంటనే విశాఖపట్నం నగరం కొత్త టెక్ దశలోకి అడుగుపెట్టనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు “భారత్ ఏఐ శక్తి” పేరిట అమలులోకి రానుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర నాయకులు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఏఐ హబ్ ఏర్పాటుతో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద టెక్ సిటీగా ఎదగనుంది. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయి. ఐటీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో యువతకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి.
చంద్రబాబు నాయుడు టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి పథకాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్ మ్యాప్పై నిలబెట్టే దిశగా మరోసారి ముందడుగు వేశారు. గూగుల్ ఏఐ హబ్తో విశాఖ రాత మారిపోనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


