*ఏపీఈపీడీసీఎల్ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
*విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం సాగర్నగర్లోని ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాయి తేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కేవలం భద్రత మాత్రమే కాదని, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి సేవాభావంతో పని చేయాల్సిన కర్తవ్యమని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల దైనందిన జీవితాలకు నేరుగా సంబంధం ఉన్న కీలక బాధ్యత అని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పని చేయాలని సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ కుటుంబాలకు ఆసరా కావడమే కాకుండా, సమాజానికి కూడా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గాజువాక నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఉపకేంద్రాల పనితీరు, పెదగంట్యాడ విద్యుత్ ఉపకేంద్రానికి సంబంధించిన అంశాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, అవసరమైన చోట్ల ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మార్పిడి, భూగర్భ కేబులింగ్ పనులు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. గాజువాకలోని పలు ప్రధాన రహదారుల్లో చేపట్టిన భూగర్భ కేబులింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
విద్యుత్ ప్రమాదాల వల్ల చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని, కరెంట్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు ఆదేశించారు. అపార్ట్మెంట్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు, పరిహార అంశాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యుత్ శాఖలోని సమస్యలను దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


