ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సర్దార్ పటేల్ జయంతి ర్యాలీ – దేశ సమైక్యతే ధ్యేయం..
తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపి (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఆధ్వర్యంలో వాహిని కాలేజ్ విద్యార్థులతో కలిసి మధిర రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం విద్యార్థులు, పోలీసు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
👮♂️ ఏసిపి, సి.ఐ సందేశం
ఈ సందర్భంగా ఏసీపి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం భారతీయులందరూ ఐక్యతగా ఉండాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే అని తెలిపారు. కులము, మతము, ప్రాంతము అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐక్యతగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ) గిరిబాబు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని దేశమంతా జరుపుకోవడం ఆయన కృషికి నిదర్శనమన్నారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో ఉన్న 500కు పైగా సంస్థానాలను ఏకం చేసి, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అఖండ భారతవనిగా ఏర్పాటు చేసి, ‘ఒకే దేశం – ఒకే పాలన’ ఉండటానికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. మనమంతా భారతీయులుగా కలిసి ఉండటానికి పాటుపడిన పటేల్ గారిని స్మరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తిరువూరు, మధిర రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

