ఆంధ్రజాతిని అవమానించిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశును అనాథను చేసిన కూటమి ప్రభుత్వం
తన గౌరవాన్ని తానే దిగజార్చుకొన్న కూటమి ప్రభుత్వం
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
“నవంబరు-01” ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యవంలో..మద్దిలపాలెం కూడలి, తెలుగుతల్లి విగ్రహం వద్ద “తెలుగుతల్లికి నీరాజనం” వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొని తెలుగుతల్లికి పుష్పాభిషేకం చేసి..మాతృభాష రక్షణ కోసం “టిట్టిభ సత్యాగ్రహం” ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో.. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. ఈ సంవత్సరమైనా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా “ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం” నిర్వహిస్తుందని ఆశించామని, కానీ చివరకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్నే నిర్వహించలేని ఈ కూటమి ప్రభుత్వం.. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మించి ఆంధ్రులను ఉద్ధరిస్తామనడంం కేవలం బూటకం అని విమర్శించారు. మన రాష్ట్రం స్వార్థపూరిత కూటమి పాలకుల పాలబడిందని, మోసపోయామని, మన భాషా సంస్కృతులకు పెద్ద ముప్పే వాటిల్లిందని.. పోరాటం చేసియైనా మన భాషా సంస్కృతులను కాపాడుకొని, భావి తరాలకు భద్రంగా అందజేయడం మన కర్తవ్యం అని అన్నాడు.
కార్యక్రమంలో పాల్గొనిన పలువురు భాషోద్యమకారులు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేదని, తూతూమంత్రం సంఘాలను ఏర్పాటు చేస్తూ…ఈ పాలకులు వేదికలపై మాత్రం తెలుగుభాష గురించి తియ్యగా కబుర్లు చెబుతూ, నిస్సిగ్గుగా ఆంగ్లభాషకు కొమ్ము కాస్తున్నారనీ నిరసన తెలియజేశారు.
కార్యక్రమంలో… తిరుపతి రాజమన్నార్, ప్రజా గాయకుడు దేవిశ్రీ, శ్యామ్ సుందర్, పంతుల లలిత, మదరిండియా, మాధవి, సాహితీవేత్త అడపా రామకృష్ణ, ఆచార్య సూరప్పడు, చేబియ్యం మోహన్, సహృదయ సురేశ్ మరియు అధిక సంఖ్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఆచార్యులు, భాషాభిమానులు పాల్గొన్నారు.


