ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్థానిక వ్యాపారాలపై పడుతోంది. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, దాని ప్రభావం ఖమ్మం నగరం తొ పాటు జిల్లా వ్యాప్తంగా
స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
5000 రూపాయలకు కమర్షియల్ సిలిండర్
సాధారణంగా రూ.2000 లోపు లభించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం అక్రమంగా రూ.5000 వరకు చేరిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కొరతను అదునుగా చేసుకుని కొంతమంది దళారులు అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కోసం హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
గ్యాస్ కొరత ప్రభావం చిన్న హోటళ్లపై ఎక్కువగా పడుతోంది. పెద్ద హోటల్ నిర్వాహకులు గత్యంతరం లేక అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేసి ఆహార పదార్థాల ధరలను పెంచి సరఫరా చేస్తున్నారు. కానీ చిన్న హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ భారాన్ని భరించలేక తమ హోటళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా నిలిచిపోవడం కారణంగా ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. హోటళ్లలో తినే భోజనం, టిఫిన్ ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్య కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని హోటల్ నిర్వాహకులు అధికారులను కోరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చినప్పుడే హోటల్ రంగం మళ్లీ పునరుద్ధరించబడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతొంది.



