వింజమూరు మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన
వింజమూరు మండల కేంద్రంలో ఏప్రిల్ 1న జరగనున్న “రైతన్న మీ సేవలో” కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమగ్రంగా పరిశీలించారు.
పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, హెలిపాడ్, ప్రజల రాకపోకల సౌకర్యాలు, పార్కింగ్, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల , జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు , ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ, సీఎం పర్యటనలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.



