అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని సి.కందులవారిపల్లి స్వర్ణ గ్రామంలో మహిళా శక్తిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు **కాకర్ల నాగార్జున, సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు మాట్లాడుతూ.. కుటుంబంతో పాటు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వెలుగు వివోఏలు మరియు స్వర్ణ గ్రామం సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరినీ శాలువాలతో సత్కరించి, గౌరవపూర్వక జ్ఞాపికలను అందజేశారు.సర్పంచ్ శ్రీమతి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పంచాయతీ డిప్యూటీ ఎంపీడీవో, జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొని మహిళా సాధికారత గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళా సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు రమణయ్య గారు, హరికృష్ణ గారు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సేవలను గుర్తించి సత్కరించినందుకు మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.



