వైద్య పరికరాల దిగుమతుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో శుక్రవారం ప్రశ్నించారు. వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తికి ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ) అమలు పరిస్థితి ఏమిటని కూడా అడిగారు.దీనికి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి భగవంత్ ఖుబా రాతపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం (పి.ఎల్.ఐ) ని ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. 21 మంది దరఖాస్తుదారులు 3420 కోట్ల రూపాయల అంచనా తో దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులో 1058.97 కోట్ల రూపాయలతో కూడిన పెట్టుబడిదారులను ఆమోదించి ఆహ్వానించినట్లు తెలిపారు. వైద్య పరికరాల పార్కుల ఏర్పాటు కోసం మరో పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ పార్కులో సాధారణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 400 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇవి ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

