తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో కాలంగి నది పై ఉన్న పాత వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు (MLA) డా. నెలవల విజయశ్రీ గారు ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరడమైనది.
సమస్య యొక్క తీవ్రత
పాత వంతెన పరిస్థితి: ప్రస్తుతం ఉన్న వంతెన బ్రిటీష్ కాలంలో, 1930లో ఇటుకలతో నిర్మించబడింది. ఇది ఇప్పుడు చాలా బలహీనంగా, సన్నగా మారింది, వంతెన వెడల్పు కేవలం 5.5 మీటర్లు మాత్రమే ఉండటం వలన ప్రస్తుతం కార్లు, టూ-వీలర్లకే అనుమతిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వస్తోంది, దీనివల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా ఈ రహదారి NH-16 జాతీయ రహదారికి కలుస్తుంది. అలాగే శ్రీ చెంగలమ్మ అమ్మవారి ఆలయం, శ్రీహరికోట స్పేస్ సెంటర్, నెలపట్టు పక్షుల అభయారణ్యం, పులికాట్ సరస్సు, శ్రీ సిటీ SEZ వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో భారీ ట్రాఫిక్, VVIP రాకపోకలు అధికంగా ఉన్నాయి.
గత ప్రభుత్వం ఈ సమస్యను నాలుగేళ్ల పాటు వాయిదా వేసి, ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు మిగిలి ఉన్న సమయంలోనే 06.11.2023 (G.O.Rt.No.325) ద్వారా ఆమోదం ఇచ్చింది. కానీ ఆమోదం వచ్చిన తరువాత కూడా పనులు ఇంకా ప్రారంభం కాలేదు అని సభ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది.
ప్రజల ఇబ్బందులు మరియు ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, వంతెన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలంటూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శాసనసభ ద్వారా కోరడమైనది.


