ఋషికొండ వద్ద నిరుద్యోగ యువత భారీ ఎత్తున చేరి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. “లాంగ్ లీవ్ చంద్రబాబు… లాంగ్ లీవ్ లోకేష్…” అంటూ జైజైల నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది.
ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్య–సాంకేతికశాఖ మంత్రి నారాలోకేష్ ప్రత్యేక కృషితో కాగ్నిజెంట్ సహా తొమ్మిది ప్రధాన సంస్థల శంకుస్థాపన జరగడం యువతకు సంక్రాంతి కానుకగా మారిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేశారు.
“విశాఖపట్నం మరొక భారీ సాంకేతిక కేంద్రంగా రూపాంతరం చెందబోతోంది. హైదరాబాద్ హైటెక్ నగరానికి సమానంగా, విశాఖను నూతన ఆలోచనల నగరంగా తీర్చిదిద్దే పునాది ఇది. శంకుస్థాపన కార్యక్రమాలు భవిష్యత్ భవనాలుగా మారి త్వరలోనే ఉద్యోగాలు అందిస్తాయని ఆశిస్తున్నాం. మా స్వస్థలంలోనే ఉద్యోగాలు లభిస్తే మాకు ఎంతో ఆనందం” అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు.
గత ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి అడిగితే భయభ్రాంతులు, అక్రమ కేసులు మాత్రమే ఎదురయ్యాయని యువత గుర్తుచేసుకున్నారు. “గతంలో జహరిగిన అన్యాయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు” అని హేమంత్ పేర్కొన్నారు.
విశాఖను ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసి, శ్రీకాకుళం నుండి కోనసీమ వరకు ఒక ఆర్థిక మండలి, అమరావతి మరొక మండలి, రాయలసీమ మరో మండలి రూపంలో అభివృద్ధి మార్గం సిద్ధమవుతుండటంపై యువత ఆనందం వెల్లివిరిసింది.
అదేవిధంగా, రానున్న ఏడు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని నారాచంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రాంతమంతా సంబర వాతావరణం నెలకొంది.


