శివాలయాలను పరిశీలించిన డీఎస్పీ బి ప్రసాద్
రామచంద్రపురం , పున్నమి ప్రతినిధి
మహాశివరాత్రి ఉత్సవాలకు శివాలయాలను నిర్వాహకులు అన్ని హంగులతో ముస్తాబు చేసి సర్వం సిద్ధం చేశారు. మండలంలోని రాయల చెరువు కట్ట కింద ఉన్న శ్రీ జలకన్టేశ్వర స్వామి, శ్రీ కామాక్షి సమేత కోటి లింగేశ్వర స్వామి, అనుపల్లి సమీపంలో ఉన్న జన్మస్థల శివాలయం, బుగ్గ మల్లేశ్వర స్వామి, పార కాలవ సమీపంలోని నవ జ్యోతి పీఠం శివాలయాలను పచ్చని పందిళ్లు, మామిడి తోరణాలు, పుష్పాలు, విద్యుపాలంకరణలతో నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం వేకువ జామున నాలుగు గంటలకు సుప్రభాత, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శ్రీ భవాని జలకంటేశ్వర స్వామి, శ్రీ కామాక్షి సమేత కోటిలింగేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణ చేసి సిద్ధ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తులకు లింగోద్భవ దర్శనం కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ కళ్యాణ మండపంలో శ్రీ కామాక్షి సమేత కోటిలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం, సాయంత్రం 5గంటలకు శ్రీ భవాని జలకంఠేశ్వర స్వామివార్లకు కళ్యాణోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భరతనాట్యం, హరికథ కాలక్షేపాలు, 8 గంటలకు అన్నదాన కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర నాటికల మండల వారిచే ద్రౌపదీ మాన సంరక్షణ అనే పౌరాణిక నాటకం ప్రదర్శించబడుతుందని గ్రామస్తులు తెలిపారు. శివాలయాల వద్ద ఏర్పాట్లను చంద్రగిరి డిఎస్పి బి ప్రసాద్, సిఐ సురేష్ కుమార్, ఎస్సై భక్తవత్సలం పరిశీలించి, ఆధ్యాత్మిక దైవచింతనతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. శివాలయాల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని డి.ఎస్.పి ప్రసాద్ తెలిపారు.
ఫోటో రైట్ అప్
1. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాయల చెరువు కట్ట కింద ఉన్న శ్రీ భవాని జలకన్టేశ్వర స్వామి ఆలయం







