*మత్స్యకారులకు ప్రభుత్వ ఆసరా*
*వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా*
,విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *_ బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్ కు లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా, 50 ఏళ్లు దాటితే పెన్షన్ వర్తింపజేసినట్టు వెల్లడించారు. సముద్రంలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వచ్చే దాకా కుటుంబం ఆందోళనలోనే ఉంటుందని, మత్స్యకారులకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్థానిక మత్స్యకారులు ఎప్పటి నుంచి అడుగుతున్న పక్కా ఇళ్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు పెద్ద ఉప్పాడలో రూ.1.39 కోట్లతో ప్రతిపాదించిన మత్స్యకారుల బహుళార్థ సాధక కేంద్రానికి.. చేపలు ఆరబెట్టే 7 ఫ్లాట్ ఫాం లకు శంకుస్థాపన చేశారు. మంగమారిపేటలో 30 మందికి రూ.6 లక్షల విలువైన సీవీడ్ రాఫ్ట్ లను అందించారు. చేపల తిమ్మాపురంలో మోటార్లు తదితర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎమ్మార్వో రామారావు, కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, పాసి నరసింగరావు, గరికిన ఎల్లాజీ, పాసి త్రినాథరావు, గొలగాని నరేంద్ర, చెట్టుపల్లి సన్యాసిరావు, సారిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


