విశాఖ గాజువాక (ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి)
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.కులవివక్ష నేపథ్యంలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం మానవత్వానికే మచ్చగా నిలిచింది.కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్,ఆయన భార్య మౌనిక తమ రెండు నెలల పసిపాపతో కలిసి జాతరకు హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం కులవివక్ష రూపం దాల్చి,కొంతమంది వ్యక్తులు కుటుంబంపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ దాడిలో పసిపాప తీవ్రంగా గాయపడగా,ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనపై గాజువాక బీసీ సంఘం అధ్యక్షులు జాగరపు శ్రీను తీవ్రంగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని,పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ సమాజంపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని,ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.బేబీ మౌనిక ఆత్మశాంతి కోసం గాజువాక గాంధీ సెంటర్లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు,తోకాడ రాము,బచ్చ త్రిమూర్తులు,జాగరపు హరిత,పూర్ణిమ,సుదమల్ల ఈశ్వరరావు,నవీన్,రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి కులహంకారపు దుశ్చర్యలు జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.





