తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:తాళ్లపూడి మండలంలో బస్సు షెల్టర్ల దుర్వినియోగంపై వెలువడిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్టీసీ డిపో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం పంచాయతీ అధికారుల సహకారంతో మండలంలోని అన్ని బస్సు షెల్టర్లను సమగ్రంగా శుభ్రపరిచినట్లు డిపో మేనేజర్ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి బస్సు షెల్టర్ పరిశుభ్రంగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. షెల్టర్ల వద్ద ఆక్రమణలు లేదా దుర్వినియోగం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బస్సు షెల్టర్లు పూర్తిగా పంచాయతీ అధికారుల ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేస్తూ, సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. తాళ్లపూడి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బస్టాండ్లో పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ వరకు అన్ని రకాల బస్సులు ఆగే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని డిపో మేనేజర్ నాయక్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కంట్రోలర్ చదలవాడ శేఖర్, పంచాయతీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.




