నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో జరుగుతున్న “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ Dr. Ajitha Vajendla ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనల మేరకు పోలీసులు ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు తదితర వాహనాలను అర్ధరాత్రి తర్వాత ఆపి డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. నిద్ర మత్తు కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి. అతివేగం వల్లే దేశంలో 70%కిపైగా ప్రమాదాలు జరుగుతున్నందున స్పీడ్ లిమిట్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రంకెన్ డ్రైవింగ్పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు.



