*ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు*
*రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ*
*విశాఖపట్నండిసెంబర్ 19పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం బిఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, .అదే విధంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నామని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నేరుగా పెన్షనర్లతో మాట్లాడి డీడీవోల సమక్షంలోనే వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశామని, డీడీవోలు, పెన్షనర్ల సమన్వయంతో తక్షణ పరిష్కారం సాధ్యపడుతుందని అన్నారు. పెన్షనర్లకు డాక్యుమెంటేషన్ ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరుకున్న పెన్షన్ పత్రాలను పరిశీలించి పదవీ విరమణ బెనిఫిట్స్ ను త్వరగా అందిస్తున్నామని ఆమె తెలిపారు*.
*ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ పేజ్ ను ప్రారంభించారు. దీని ద్వారా పెన్షన్ దారులు వ్యక్తిగత ప్రయోజనాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.*
*ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ దారుల ప్రయోజనాలకు సంబంధించి కొంత మేరా జాప్యం జరిగేదని, డిజిటలైజేషన్ చేయుట ద్వారా పనులను త్వరితగతిన చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని పెన్షన్దారులకు పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*


