చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోన్న పెంచలకోనకు వెళ్ళేందుకు సరైన రహదారి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేజర్ల మండలం ఆదూరుపల్లి నుండి రాపూరు మండలం గోనుపల్లి వరకు దాదాపు 20 కిలో మీటర్ల దూరం రోడ్డుపై అడుగుకు ఒక గుంత చొప్పున ప్రయాణం నరకయాతనగా ఉన్నదని వాహనదారులు వాపోతున్నారు.ఈ మార్గంలో ప్రతి రోజూ వందలాది వాహనాలలో భక్తులు ప్రయాణిస్తుంటారు. గత ఎన్నికల ముందు నేటి సిఎం చంద్రబాబు నాయుడు కూడా స్వామి వారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. గత బ్రహ్మోత్సవాల్లో నామమాత్రంగా గుంతలు పూడ్చారు. ఆ పనులలో కాంట్రాక్టర్లు నాసిరకం కంకర మరియు తారు వేయడం వలన చిన్నపాటి వర్షానికే తారు కంకర లేచిపోయి మరలా గుంతల మయం అయిపోయాయి. ఈ మార్గం గుండా నిత్యం ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రయాణిస్తున్న ఎవరు కూడా దీని బాగు కొరకు పట్టించుకున్న వారు లేరు.ఎవరూ కూడా ఈ రోడ్డు బాగు చేయించుకోలేక పోతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుండి సుమారు వందల వాహనాలు శుక్ర, శని వారాలలో పోతూ, వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు వెంబడి గ్రామాలకు నిత్యం ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తుంటాయి. ఆయా గ్రామాల నుండి ప్రతిరోజు బస్సులు కూడా ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి .కానీ ఎవ్వరు ఈ రోడ్డు గురించి మాత్రం పట్టించుకోరు. చిన్నపాటి వర్షం కురిసిన ఇక్కడ రోడ్లు చెరువును తలపిస్తుంటాయి. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అనేకమార్లు అధికారులకు ,నాయకులకు, ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక నెల క్రితం ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా గుంటలు చదును చేయించారు కానీ, తరువాత వర్షాలకి మళ్లీ పూర్వస్థితికి వచ్చేసాయి. కానీ మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి రోడ్డంతా జలమయం అయింది, ఆ నీరు అలాగే ఉండటం గుంతలు పెద్దగా మారి రోడ్డు రూపురేఖలు మారిపోతున్నాయి. కావున ఈ రోడ్డు గురించి అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించగలరని, మావూరి రోడ్ కి మోక్షం ఎప్పుడో ? అని ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


