పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. చేతికొచ్చిన పంటలు రైతుల కళ్ళ ముందే వర్షాలకు నీటిలో మునగడంతో వరి, మిర్చి, మొక్కజొన్న, పాటు పత్తి కాయల సైతం నల్లగా మారాయని, నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేసి ఎకరానికి రూ.30వేల నుంచి 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నష్టపోయిన రైతులను గుర్తించి రైతులందరినీ సమీకరించి ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రైతులు బాధలతో ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా ఉంటూ పంట నష్టపరిహారం చెల్లించే వరకు రైతుల వెంటే ఉంటామన్నారు. పంట నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన కోరారు.


