చెరువులు, కాలువలు, భూగర్భ జలాల సంరక్షణపై సమగ్ర చర్యలు
ప్రజాభూమి ప్రతినిధి, రామచంద్రపురం
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట పైన ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు .
ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టే ముఖ్య కార్యక్రమాలను వివరించారు:
చెరువులు మరియు కాలువల పునరుద్ధరణ: చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత, మరమ్మత్తులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.
చెరువుల అనుసంధానం: సమీప చెరువులను పరస్పరం అనుసంధానం చేసి వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసి వినియోగించడం.
నీటి సంరక్షణ నిర్మాణాలు: చెక్డ్యామ్లు, పెర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ పిట్స్ వంటి నిర్మాణాల ద్వారా నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పునాదరణ.
పచ్చదనం పెంపొందించడం: నీటి వనరుల చుట్టుపక్కల చెట్లు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడం.
భూగర్భ జలాల పునాదరణ: వర్షపు నీటిని నేలలోకి చొచ్చుకుపోయే విధంగా చర్యలు తీసుకుని భూగర్భ జలాల స్థాయిని పెంచడం.
సమీకృత నీటి నిర్వహణ గ్రామ స్థాయిలో నీటి వినియోగంపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి, సాగు నీటి సంఘాల భాగస్వామ్యంతో అమలు చేయడం.
సాగు నీటి సంఘాలు నీటి పంపిణీ, సంరక్షణ, నిర్వహణలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. రైతులు నీటి వినియోగంలో బాధ్యతగా వ్యవహరించి, నీటి వృథాను తగ్గించే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆమె ప్రకారం రాయలచెరువుని అభివృద్ధి చేసే దిశగా పనులు ప్రారంభించామని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి మరియు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. చెరువులు, కాలువలు పునరుద్ధరణ ద్వారా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అలాగే అధికారులు చెరువులు, కాలువల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలు స్వీకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు , ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సాగు నీటి సంఘాల సభ్యులు, మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




