పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగిన ఘటనలో 57 మంది దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం రాజకీయ వేధింపుల భాగమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్పై విడుదలైన మహిళలకు, పురుషులకు ఆయన పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులు పూర్తిగా అక్రమంగా నమోదు చేసినవేనని, దళితుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రాఘరామకృష్ణంరాజు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తూ, నిర్దోషులపై నమోదైన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాల్సిన ప్రధాన రాజకీయ నాయకులు మౌనం పాటించడం కూడా ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించారు.


