హైదరాబాద్, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ను తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తి చేయాలని, ఇప్పటికే 35 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైకోర్టు తీర్పు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్, వరంగల్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
అలాగే 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి, రామగుండం పాత థర్మల్ స్టేషన్ను తొలగించేందుకు అనుమతి మంజూరు చేసింది.


