నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్పి ఆదేశాల మేరకు సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు కలిసి నెల్లూరు పట్టణం, శివారు ప్రాంతాలు మరియు నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పాడుబడిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నదీ తీర ప్రాంతాలపై డ్రోన్లను పంపించి నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక లేదా క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రత్యేకంగా గంజాయి సేవించడం, అమ్మడం లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు మరియు నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ వినూత్న చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.



