పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా నమూనాకు 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక విశిష్టమైన గుర్తింపు లభించినందుకు మార్చి 31ని మన జాతీయ జెండా పుట్టిన రోజుగా స్మరించుకుంటాము.
చరిత్రలోకి వెళితే.. 1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలోని విక్టోరియా మెమోరియల్ హాల్ ప్రస్తుత బాపూ మ్యూజియంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అప్పటికే వివిధ దేశాల జెండాలపై అధ్యయనం చేసిన పింగళి వెంకయ్య, గాంధీజీ ఆదేశం మేరకు కేవలం మూడు గంటల వ్యవధిలో జెండా నమూనాను సిద్ధం చేసి ఆయనకు అందించారు. మొదట ఆయన రూపొందించిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీజీ సూచన మేరకు శాంతికి చిహ్నంగా తెలుపు రంగును, అలాగే మధ్యలో దేశ ప్రగతికి మరియు స్వరాజ్యానికి గుర్తుగా రాట్నం గుర్తును చేర్చారు. ఈ డిజైన్ను గాంధీజీ ఆమోదించి, కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించారు. అప్పటి నుండి పింగళి వెంకయ్య జెండా వెంకయ్య’గా ప్రఖ్యాతి చెందారు. ఈ సందర్భంగా జాతీయ జెండాపై ఈ గేయం/ కవిత.
జెండా జెండా భారత జెండా ఇది భారత జెండా
రోజు మనము తలచే జెండా మన మదిలో నిండా
ఐక్యతేచ్చకు ప్రాణంగా త్రివర్ణ స్వచ్ఛత భావంగా
ఆశయసిద్ధికి నేత్రంగా ఏకత రక్షకు నిలయంగా
ఎగురుతున్న జెండా భారత జెండా ప్రతి మదిలో నిండా
భిన్నత్వంలో ఏకత్వం సఖ్యతయే మన తత్వం అంటూ
కాషాయం కమనీయం శౌర్యానికి తగు నియమం అంటూ
తెలుపు శాంతికి సంకేతం ఆ తెలుపే జన సమ్మత మంటూ
పచ్చదనం పాడిపంటలు పసిడిదనంగా మెరిసే జెండా
నిత్యం సత్యం విజయంగా
నిత్యం సత్యం విజయంగా
చూపే అశోక చక్రపు జెండా
జెండా జెండా భారత జెండా ఇది భారత జెండా
రోజు మనము తలచే జెండా మన మదిలో నిండా
జాతి కీర్తిని చాటే జెండా దేశభక్తిని నింపే జెండా
రాజ్యమంతటా ఎగిరే జెండా రాజసమునకే ఊపిరి నిండా
త్యాగమూర్తుల సంపద జెండా తరతరాలు నిలిచే జెండా
విజయపథంతో ఎగిరే జెండా నాటి స్ఫూర్తిని నిలిపే జెండా
భారతమాత భావహంగులే
భారతమాత భావహంగులే
మూడు రంగులై నిలిచిన జెండా //జెండా//


